22/05/2018
ఎస్ఐ, కానిస్టేబుల్కు ఒకే ‘టెస్ట్’!
ఒక్కసారి ఫిజికల్ టెస్టు.. 6 నెలలు వర్తింపు
మెడికల్ టెస్టు మాత్రం ఎప్పటికప్పుడే
తాజా నోటిఫికేషన్ నుంచి నూతన విధానం
నోటిఫికేషన్ నుంచి ఎంపిక వరకు ఆరు నెలల్లోనే ప్రక్రియ పూర్తి
హైదరాబాద్, మే 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల నియామక విధానంలో ప్రభుత్వం మరో నూతన విధానాన్ని అమల్లోకి తేనుంది. పోలీస్ శాఖలో వేర్వేరు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నా.. ఒక్కసారి మాత్రమే దేహదారుఢ్య పరీక్ష (ఫిజికల్ టెస్ట్)కు హాజరైతే సరిపోయేలా నిర్ణయం తీసుకోనుంది. ఒకసారి ఫిజికల్ టెస్టు ద్వారా పొందిన ఫిట్నెస్ సర్టిఫికెట్ను ఆరు నెలల వరకు జరిగే అన్ని పోలీస్ ఉద్యోగాల ఎంపికకు వర్తింపజేయనున్నారు. తద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ స్థాయిలో దేనికి ముందుగా ఫిజికల్ టెస్ట్ నిర్వహించినా.. ఆ తర్వాత పోస్టుకు మళ్లీ ఆ టెస్టును నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోనుంది. ఎస్ఐ, కానిస్టేబుల్ స్థాయిలో 18 వేల పోస్టుల భర్తీకి త్వరలో వెలువడనున్న నోటిఫికేషన్లో ఈ మేరకు మార్పులు చేయనున్నట్లు సమాచారం. అర్హత కలిగిన నిరుద్యోగులు ఇటు ఎస్ఐతోపాటు అటు కానిస్టేబుల్ పోస్టులకూ దరఖాస్తు చేస్తుండటం, ఒకే అభ్యర్థికి రోజుల వ్యవధిలోనే వేర్వేరుగా ఫిజికల్ టెస్ట్లు నిర్వహించడం వల్ల కాలయాపనతోపాటు అభ్యర్థులకు ఇబ్బందులూ ఎదురవుతున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ మేరకే ఆ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించారు. దీనిపై ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. అయితే ఫిజికల్ టెస్టును ఆరు నెలలకు ఒకసారి మాత్రమే నిర్వహించినా.. ఆయా పోస్టులకు వైద్య పరీక్ష (మెడికల్ టెస్టు)లు మాత్రం ఎప్పటికప్పుడు నిర్వహిస్తారు. దీంతో ఒకసారి ఫిజికల్ టెస్ట్కు హాజరై ఉత్తీర్ణత సాధించిన తర్వాత.. ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే మెడికల్ టెస్టులో తెలిసిపోతుంది. అయితే ఫిజికల్ టెస్టుకు సంబంధించి తాజా నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఒక పోస్టుకు సంబంధించిన పరీక్షలో విఫలమైతే.. రెండో పరీక్షకు మరింత కష్టపడి సిద్ధమవుతారని, ఆరు నెలల వరకు అదే సర్టిఫికెట్ను పరిగణనలోకి తీసుకుంటే వారు మరోసారి ప్రయత్నించే అవకాశాన్ని కోల్పోతారని అంటున్నారు. ఇదిలా ఉండగా.. 18 వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ నుంచి శిక్షణకు అభ్యర్థుల ఎంపిక దాకా మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లోనే పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.