18/08/2026
ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్ల ప్రమోషన్ల సమస్యలను పరిష్కరించాలి
అసెంబ్లీ వేదికగా ప్రత్యేక జీరో అవర్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి
పుట్టపర్తి : ఆగస్టు 18
రాష్ట్రవ్యాప్తంగా నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న డైరెక్ట్ రిక్రూట్మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల (AEE) ప్రమోషన్లకు సంబంధించి నెలకొన్న సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి కోరారు.
విజయవాడ–అమరావతిలో జరుగుతున్న 16వ శాసనసభ సమావేశాల రెండో రోజు మంగళవారం ప్రత్యేక జీరో అవర్లో ఎమ్మెల్యే సింధూర రెడ్డి ఈ అంశాన్ని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
2010లో జారీ చేసిన జీఓ ఎంఎస్ నం.32 కారణంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులైన సుమారు 3,000 మంది ఇరిగేషన్ ఇంజనీర్ల ప్రమోషన్ల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆమె సభ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏఈఈలుగా విధులు నిర్వహిస్తున్న ఇంజనీర్లు అదే శాఖలో డీఈలుగా పదోన్నతులు పొందే విషయంలో నిబంధనల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఇరిగేషన్ శాఖలో ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఇంజనీర్లకు వారి సీనియారిటీ, అర్హతలకు అనుగుణంగా ప్రమోషన్లు లభించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే తరహా సమస్య తెలంగాణలో పరిష్కారమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొనసాగుతుండటం వల్ల ఇంజనీర్లలో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం 2023లో ఈ అంశంపై ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని ఎమ్మెల్యే సింధూర రెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు.
ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఏఈఈల ప్రమోషన్లకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం పునఃపరిశీలించి, న్యాయపరమైన మరియు పరిపాలనా సమస్యలను పరిష్కరించి, అర్హులైన ఇంజనీర్లకు పదోన్నతులు కల్పించేలా తగిన నిర్ణయం తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
ఇంజనీర్లకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ సమస్యపై సానుకూలంగా స్పందించి, త్వరితగతిన పరిష్కారం చూపుతుందని ఆశిస్తున్నట్లు పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి తెలిపారు. ***eSindhuraReddy