11/03/2023
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ కు ఇండియా అండ!.................................................................
పొరుగుదేశాలకు ఆర్థిక సంక్షోభాలకు ఎదురైతే ఇండియా వెంటనే వాటికి సాయపడుతుంది. శ్రీలంక విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు మన సోదర దేశం పాకిస్తాన్ మున్నెన్నడూ కనీవినీ ఎరగని తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గతంలో ఇరు దేశాల మధ్య నాలుగుసార్లు యుద్ధాలు జరిగాయి కాని పాకిస్తాన్, భారత్ 1947లో స్వాతంత్య్రం వచ్చే వరకూ ఒకే దేశం. ఒకే జాతి. దేశ విభజన జరిగినా పాక్ తో సత్సంబంధాలనే భారత్ కోరుకుంటోంది. అందుకోసం నిరంతరం ప్రయత్నిస్తోంది. కిందటేడాది జులై, ఆగస్ట్ నెలల్లో కురిసిన భారీ వర్షాలతో పాక్ ఆర్థిక సంక్షోభం మొదలైంది. 23 కోట్లకు పైగా జనాభా ఉన్న ఈ దేశంలో మామూలుగా ఈ రెండు మాసాల్లో కురిసే సాధారణ వర్షపాతానికి 190 శాతం ఎక్కువ వానలు 2022లో పడ్డాయి. మామూలుగా భారీ వర్షాలు పడని బలూచిస్తాన్, సిం«ద్ రాష్ట్రాల్లో అయితే 450 శాతం ఎక్కువ వానలు కురిశాయి. ఫలితంగా పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. సహజంగా పనిచేసే డ్రయినేజీ వ్యవస్థ దెబ్బతింది. సారవంతమైన సాగుభూములు, జనావాసాలు వరదల్లో దెబ్బదిన్నాయి. ఈ భారీ వర్షాల వల్ల పాకిస్తాన్ లోని మూడో వంతు భూభాగం నీటమునిగింది. వరద దెబ్బకు 15 వేలకు పైగా జనం మరణించడమో లేదా గాయపడడమో జరిగింది. 80 లక్షల మంది నిర్వాసితులయ్యారు. 20 లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వర్షాలతో వచ్చిన వరదల వల్ల ఈ దేశానికి దాని జీడీపీలో రెండు శాతం నష్టం సంభవించింది. వ్యవసాయం రంగం అత్యధికంగా (జీడీపీలో 0.9%) నష్టపోయింది. ఇలా ఆరు మాసాల క్రితం వచ్చిన వరదలతో మొదలైన పాక్ ఆర్థిక సంక్షోభం ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. ఇండియా వరదల సమయం నుంచి ఇప్పటి వరకూ తన సోదర దేశానికి తన వంతు సాయం అందిస్తూనే ఉంది.
ఆటోమొబైల్ రంగం నుంచి అన్ని సెక్టర్లపై ఆర్థిక ఇబ్బందుల ప్రభావం......................................................................................
పాకిస్తాన్ ఓ పక్క రాజకీయ అస్థిరతతో, మరోపక్క ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలమౌతోంది. ఈ దేశంలో ద్రవ్యోల్బణం 40% దాటింది. కింటేడాది పాక్ రూపాయి 33% విలువ కోల్పోయింది. రుణాలు పొందడం గగనమైపోతోంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు బాగా అడుగంటాయి. ఈ నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడే పాక్ ఆటోమొబైల్ పరిశ్రమ కుదేలైంది. టొయోటా, హోండా, పాక్ సుజుకి వంటి అగ్రశ్రేణి కంపెనీలు పాకిస్తాన్లోని తమ ఉత్పత్తుల అసెంబ్లీ, తయారీ ప్లాంట్లను ఇటీవల మూసివేశాయి. కొన్ని కార్ల కంపెనీలు మార్చి నెలాఖరు వరకూ మూసివేస్తున్నట్టు ప్రకటించాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కార్ల నుంచి అనేక నిత్యావసర వస్తువులకు సైకం డిమాండు లేకుండా పోయింది. మరో పక్క 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం రాజ్యాంగబద్ధ పార్లమెంటరీ ప్రాజాస్వామ్య వ్యవస్థతో అన్ని రంగాల్లో ఎన్నడూ లేనంత ఎక్కువ ప్రగతి సాధిస్తోంది. ఇండియాకు సైతం అప్పుడప్పుడూ మతవిద్వేషాలు, ప్రాంతీయభేదాలు వంటి సమస్యలున్నా పాక్ మాదిరిగా అంతర్గత కల్లోలాలతో సమమతమయ్యే దేశం కాదు.
రాజ్యాంగబద్ధ పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే భారతదేశానికి శ్రీరామరక్ష.........................................................................................
32 ఏళ్లుగా అమలవుతున్న ఆర్థిక సంస్కరణలతోపాటు జనసంక్షేమ పథకాలు ఇండియాలో ప్రజల జీవనప్రమాణాలను బాగా పెంచేశాయి. సంపద సృష్టితో పేదరికం గణనీయంగా తగ్గుతోంది. రాష్ట్రాల్లో ప్రజా సంక్షేమ పథకాలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి. మత ప్రాతిపదికన రూపుదిద్దుకున్న పాకిస్తాన్ పైన వివరించిన తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం భారతీయులెందరికో బాధ కలిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక కడగండ్లు చూసిన కొందరైతే–దేశ విభజన జరిగి ఉండకపోతే మొత్తం భారత ఉపఖండం ప్రజలు మరెంత అభివృద్ధి సాధించేవారో! అని ఊహాలోకంలో తేలియాడుతూ అంచనాలు వేసుకుంటున్నారు. ఇండియా నేడు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి తొలి ప్రధాని నెహ్రూ కాలం నుంచి నేటి నరేంద్ర మోదీ హయాం వరకూ అర్థికరంగంలో వేసిన పునాదులు, ఆయా ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజాతంత్ర, లిబరల్ విధానాలే కారణమని ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. పాక్ ను ఇండియా ఎప్పుడూ కేవలం శత్రుదేశంగానే చూడకుండా ప్రకృతి విపత్తుల సమయంలో చిన్న తమ్ముడిని పెద్దన్న ఆదుకున్నట్టే ఆదుకుంటోంది. ప్రస్తుత సంక్షోభం నుంచి పాకిస్తాన్ కోలుకుని ముందుకు సాగడానికి తన వంతు సాయం భారత దేశం అన్ని విధాలా అందిస్తోంది.