26/04/2020
*ప్రస్తుత సమాజంలో ప్రైవేట్ పాఠశాలలు ప్రజాప్రతినిధుల ప్రసంగాలతో, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వార్తల వల్ల ప్రజలు మరియు తల్లిదండ్రుల హృదయాలలో దోపిడీ వ్యవస్థలుగా ముద్రించబడ్డాయి. గత 50సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో విద్యావ్యవస్థకు ఒక పవిత్రత, గౌరవం ఉండేది. గురువులను గొప్పగా కీర్తించేవారు. కానీ ప్రస్తుత సమాజంలో గురువుకు విలువ లేదు.*
*ప్రైవేట్ స్కూళ్లలో మూడు రకాల కేటగిరీలు ఉన్నాయి. దానిలో 1.ఇంటర్నేషనల్ స్కూల్స్, 2.కార్పొరేట్ స్కూల్స్, 3.బడ్జెట్ స్కూల్స్. ఇంటర్నేషనల్ స్కూళ్లలో సుమారు మూడు లక్షల రూపాయలకు పైగా ఫీజులు ఉంటాయి. ఇంటర్నేషనల్ స్కూల్ యజమానులకు 10 రకాల బిజినెస్ లు ఉంటాయి. వీరు ఏ రోజుకుడా పేరెంట్స్ ను కలవడానికి అవకాశం ఉండదు.కార్పొరేట్ స్కూళ్లలో లక్షకు పైగా ఫీజులు ఉంటాయి. కార్పొరేట్ స్కూల్స్ అనగా శ్రీ చైతన్య, నారాయణ లాంటి చైన్ ఆఫ్ స్కూల్స్. సుమారు ఏడు ఎనిమిది రాష్ట్రాలలో వందల బ్రాంచులు ఉంటాయి. వీరు కూడా తల్లిదండ్రులను కలిసే అవకాశాలు లేవు.బడ్జెట్ స్కూళ్లలో నలభై వేల లోపు ఫీజులు ఉంటాయి. బడ్జెట్ స్కూల్స్ అంటే స్థానికంగా చదువుకొని నిత్యం తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటూ నెలకొల్పబడిన పాఠశాలలు.*
*ఒక దౌర్భాగ్యం ఏమిటంటే ఈ మూడు కేటగిరీలుగా ఉన్న ప్రైవేట్ స్కూళ్లను ప్రభుత్వం మరియు ప్రజలు ఒకే విధంగా చూస్తున్నారు. సంపాదించాలన్న ఒకే ఉద్దేశ్యం బడ్జెట్ పాఠశాల కరెస్పాండెంటుకు ఉంటే ఈ రోజు ఒక వైన్స్ షాప్, రెస్టారెంట్, ప్లై వుడ్ షాప్, సూపర్ మార్కెట్, కాంట్రాక్టులు, షోరూములు..ఇలాంటి అనేక ఇతర రంగాలకు వెళ్లేవారు. కానీ విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్న అన్నింటిని ఒదులుకొని నా దేశం బాగుపడాలంటే చదువు బాగుంటే దేశం బాగుపడుతుంది భావించి, విద్యాభివృద్ధియే దేశాభివృద్ధి అని నమ్మి, జీవితాన్ని త్యాగం చేసి నెలనెలా ఫీజులు సరిగా వసూలు కాకున్నా వారికివారు తాకట్టు పెట్టుకొని నడుపుతున్న పాఠశాలలు బడ్జెట్ పాఠశాలలు.*
*కరోనా విపత్తు నేపధ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించగానే SA-2 పరీక్షలు నిర్వహించకుండా, సుమారు 50 శాతం ఫీజులు రావాల్సి ఉన్నా విద్యార్థుల ఆరోగ్య శ్రేయస్సు, ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ పాఠశాలలు మూసివేయడం జరిగింది.*
*కానీ అనేక రంగాలను మానవతా దృక్పథం తో చూస్తున్న ప్రభుత్వం బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలపై మాత్రం అణచివేత ధోరణి అవలంబిస్తుంది. ప్రభుత్వం ఒకవైపు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించమని చెబుతూ మరోవైపు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు బకాయిలు వసూలు చేయవద్దని, దానికి తోడుగా ఫీజు బకాయిలు అడిగితే 100 టోల్ ఫ్రీ నెంబరుకు డయల్ చేసి పిర్యాదు చేయమని తల్లిదండ్రులను ఉసిగొల్పడం బాధాకరం.*
*లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం జీతాలు చెల్లించి ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు పూర్తి వేతనం చెల్లించమని ఆదేశించడం ఎంత వరకు సమంజసం.*
*ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు రావాల్సిన ఫీజు బకాయిలు వసూలు చేయవద్దని చెబుతూ ప్రభుత్వానికి రావాల్సిన కరెంట్ బిల్లులు యధావిధిగా వసూలు చేయడం ఎంతవరకు సమంజసం.*
*వచ్చే విద్యాసంవత్సరం పాఠశాలల్లో ఫీజులు పెంచద్దు అన్న ప్రభుత్వం గతంలో ఆర్టీసీ సమ్మె తరువాత ఆ లోటు పూడ్చుకోవడానికి చార్జీలు పెంచినట్టు రేపు లాక్ డౌన్ పూర్తి అయిన తర్వాత ఈ లోటును పూడ్చుకునేందుకు నిత్యావసర వస్తువుల పైన, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా అనేక వాటి ధరలు పెంచకుండా ఉంటుందా...!*
*బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో చాలా మంది కరెస్పాండెంట్లు పాఠశాల భవనం అద్దె కట్టలేక, బస్సుల EMI లు కట్టలేక, ఫీజులు వసూలు కానప్పుడు సిబ్బంది జీతాలకోసం తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక సతమతమవుతూ కనీసం రెండుపూటలా భోజనం చేయలేని దయనీయమైన దుస్థితిలో ఉన్నారు.*
*ఇన్ని కష్టనష్టాలు ఎదుర్కొంటు కూడా లాక్ డౌన్ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని రాబోయే విద్యాసంవత్సరానికి ఫీజులు పెంచబోమని నిర్ణయం తీసుకున్నాము. ప్రభుత్వాన్ని, తల్లిదండ్రులను, పోషకులను, మేధావులను, అధికారులను, మా పరిస్థితిని మానవత దృక్పథంతో అర్థం చేసుకొని మా మనుగడకు సహకరించగలరని ప్రార్థన.*
*SAVE BADGET PRIVATE SCHOOLS*