21/07/2026
తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వాలి!
- టీయూజేవీ కన్వీనర్ భారత సుదర్శన్ -
తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు శాశ్వత నివాస & ఆరోగ్య భద్రత కల్పించాలని తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక కన్వీనర్ భారత సుదర్శన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు 'తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె.కేశవరావును అమరవీరుల స్థూపం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా భారత సుదర్శన్ మాట్లాడుతూ..
తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులుగా తెలంగాణ ప్రజల చిరకాల కాంక్ష అయిన "తెలంగాణ స్వరాష్ట్ర సాధన' ఉద్యమంలో శిఖరాగ్రస్థాయిలో పనిచేసి, తెలంగాణ ఉద్యమంలో మమేకమైన సంగతి అందరికీ తెలిసిందేనని అన్నారు. ఉద్యమ సమయంలో మా ఉద్యోగాలు కోల్పోయి, కుటుంబాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నా కూడా మొక్కవోని దీక్షతో పాల్గొన్నామన్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులుగా మేము ఆనాడు సమైక్య పాలనలో పోలీసుల నిర్భంధాలతో పాటుగా అనేక ఇబ్బందులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎదుర్కొన్నామని ఆవేదన చెందారు. అన్ని పక్షాలు నెత్తిన తడిబట్ట వేసుకొని కూర్చున్నప్పుడు కూడా తెలంగాణ జర్నలుస్టులుగా మేం ఉద్యమ కొలిమిని రగిల్చి 'తెలంగాణ ఉద్యమ పోరాట జ్వాల' ఆరిపోకుండా..ఆగకుండా చేసామన్న విషయం ప్రపంచానికి తెలిసిందేనని సుదర్శన్ అన్నారు.
తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించాక మా తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల కష్టాలు తొలగిపోలేదన్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులుగా ముద్రపడ్డ మాకు ఏ సమైక్యాంధ్ర మీడియా సంస్థలు ఉద్యోగాలను ఇవ్వలేదన్నారు. ఫలితంగా తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల కుటుంబాలు అనేక ఇబ్బందులను ఇప్పటికీ ఎదుర్కొంటున్నాయన్నారు. ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు మమ్మల్ని వాడుకొని నడిరోడ్డుపైన వదిలేసాయని భారత సుదర్శన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిందిస్థాయిలో పనిచేసిన, చేస్తున్న వందలాది మంది తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు ప్రభుత్వాలు ఏమాత్రం న్యాయం చేయలేకపోయాయన్నారు.
అన్ని రకాల జీవన సౌకర్యాలను కోల్పోయిన మా తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ
'శాశ్వత నివాసం మరియు శాశ్వత ఆరోగ్య భద్రత'లను కల్పించాలని కన్వీనర్ భారత సుదర్శన్ ప్రభుత్వాన్ని కోరారు.
కమిటీని కలిసినవారిలో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక నాయకులు మహేశుని లక్ష్మయ్య నేత, కాసాని శ్రీనివాస రావు, బాయికాడి వెంకట్, వినోద్, శివకోటి, నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.